గ్రానైట్ క్వారీలపై గ్రామస్తుల పోరుబాట

AP: గ్రానైట్ క్వారీలతో పర్యావరణం దెబ్బతింటోందని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రజాభిప్రాయ సేకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం ఉర్లావ రెవెన్యూ పరిధిలో అమర్ గ్రానైట్ క్వారీలకు సంబంధించి నిర్వహించనున్న ప్రజా అభిప్రాయ సేకరణను రద్దు చేయాలని గ్రామస్తులు కోరారు. క్వారీల నిర్వహణతో కొండగట్లు ధ్వంసమవుతున్నాయని, చెరువులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీల నుంచి వెలువడుతున్న దుమ్ము గిరిజనుల పంట పొలాలపై పేరుకుపోయి పంటలకు నష్టం కలిగిస్తోందన్నారు.





