పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని శివాజీనగర్లో శివాజీ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పసుపు కొమ్ములతో తయారు చేసిన పర్యావరణహిత గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు 40 కిలోల పసుపు కొమ్ములతో పాటు మైదాపిండి, వెదురు, గోనె సంచులను ఉపయోగించి రూ.20 వేల ఖర్చుతో విగ్రహాన్ని రూపొందించారు. పీఓపీకి దూరంగా పర్యావరణహిత గణపతులను ఏర్పాటు చేయడాన్ని నిర్వాహకులు గత 15 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు వినూత్న రీతిలో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న శివాజీ దళ్ సభ్యులను స్థానికులు అభినందించారు.



