అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు.. రోడ్లు, వంతెనలు జలమయం!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. పాడేరు, పెదబయలు, ముంచింగిపుట్టు, గూడెంకొత్తవీధి, చింతపల్లి, జె. మడుగుల మండలాల్లో వర్షం దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పాడేరు-సిరివాడ మార్గంలోని బొంతు వంతెనపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెదబయలు మండలం గుల్లేలు పంచాయతీ కింద ఉన్న వంతెనపై బంగారు వాగు పొంగిపొర్లుతోంది. బంత్రోటుపుట్టు, కుంతురు గ్రామాల సమీపంలో గెడ్డలు పొంగాయి.